కోల్కతా : మతసామరస్యానికి ప్రతీకగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా నగరంలోని అలీముద్దీన్ వీధిలో స్ధానిక ముస్లింలు అక్కడ నివసించే హిందువుల కోసం దుర్గా పూజ మంటపాన్ని ఏర్పాటు చేశారు. కోల్కతాలోని అలిముద్దీన్ వీధిలో ముస్లింలు అధికంగా ఉంటారు. ఈ ప్రాంతం నుంచి పలు హిందూ కుటుంబాలు వలస వెళ్లడంతో 15 ఏండ్ల నుంచి ఇక్కడ దుర్గా పూజ వేడుకలు జరగడం లేదు. ఇక్కడ కేవలం మూడు హిందూ కుటుంబాలే మిగిలి ఉండటంతో దసరా వేడుకలు కళ తప్పాయి. ఈ ఏడాది ఎలాగైనా దుర్గా పూజ నిర్వహించాలని ఈ మూడు కుటుంబాల వారు స్ధానిక ముస్లింలను సంప్రదించారు.
సమాజంలో మతసామరస్యం, సోదరభావం పెంచేందుకు సంకేతంలా దుర్గా పూజ మంటపాన్ని హిందూ సోదరుల కోసం ఏర్పాటు చేసేందుకు ముస్లింలు సంతోషంగా ముందుకొచ్చారు. ముందు తామంతా బెంగాలీలమని, తాము ఇక్కడే పుట్టామని, మతం తాలూకు గుర్తింపులు తర్వాతేనని స్ధానిక ముస్లింఉ తౌసిఫ్, రఫీక్లు చెప్పుకొచ్చారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు వంటి మతాలేవైనా తాము పండుగలన్నింటినీ కలిసి జరుపుకుంటామని అన్నారు. ఈద్ సందర్బంగా హిందూ, క్రైస్తవులు తమ ఇండ్లకు వస్తారని, వారి ఇండ్లలో జరిగే పూజల్లో తాము పాల్గొంటామని చెప్పారు. మరోవైపు దుర్గా పూజ సందర్భంగా మంటపాల వద్ద కోల్కతా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.