వలస కూలీలు, నిరుపేదలకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు
20 రోజులుగా దవాఖానల ఎదుట అన్నదానం
అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
కొత్తపల్లి, జూన్ 7: మాయదారి రోగం కరోనా మూలంగా నిరుపేదలు, వలస కూలీలు, అనాథలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నారు. బతుకుదెరువు కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి వచ్చిన వారికి కొవిడ్ మహమ్మారితో పనులు లేకుండా పోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, వారికి మేమున్నామంటూ ముందుకు వచ్చి భరోసా కల్పిస్తున్నారు టీఆర్ఎస్ మైనార్టీ విభాగానికి చెందిన నాయకులు. 20 రోజులుగా ఆహారంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు అందజేస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
కరీంనగర్కు చెందిన టీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకులు, సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ మిత్రులు, శ్రేయాభిలాషుల సహకారంతో నగరంలో అన్నార్తులకు నిరంతరాయంగా భోజనం అందజేస్తున్నారు. అలాగే వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానతో పాటు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వస్తున్న పేదల ఇబ్బందులను గుర్తించి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో వారికి భోజనాలు, అల్పాహారం, మంచినీటిని సమకూరుస్తున్నారు. అలాగే ఎవరైనా భోజనం కావాలని ఫోన్ చేసినా వారికి ఆహారం అందిస్తున్నారు. ఆపద సమయంలో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల కడుపు నింపుతున్న వీరి సేవలకు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభినందించిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
కష్టకాలంలో నిరుపేదలు, వలసకూలీలు, నిరాశ్రయులు, రోజువారీ కూలీలకు 20 రోజులుగా అన్నదానం చేస్తున్న మైనార్టీ నాయకులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభినందించారు. ఆయా సేవలను స్వయంగా పరిశీలించిన ఆయన సోమవారం వీరిని తన కార్యాలయానికి పిలిపించుకొని అభినందించి ప్రోత్సహించారు. మైనార్టీ నాయకుడు షేక్ యూసుఫ్తోపాటు సేవా కార్యక్రమానికి సహకారం అందిస్తున్న వారిని సత్కరించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో వీరు చేస్తున్న సేవలు గొప్పవని ప్రశంసించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. ఇక్కడ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న టీఆర్ఎస్వీ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫహాద్, మైనార్టీ నాయకులు, కో ఆప్షన్ సభ్యులు షుకూర్, ఇస్తకార్, ఇర్ఫాన్, మహబూబ్, దూదేకుల అజీమ్, అస్మత్, ఇస్తాయిక్, బియాబానీ, సాజీద్, వసీం, షాద్ ఉన్నారు.