హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.17వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో సెర్ప్ ద్వారా రూ.12వేల కోట్లు, స్త్రీనిధి నుంచి రూ.3వేల కోట్ల వరకు, మెప్మా ద్వారా రూ.2వేల కోట్ల రుణాలను అందించనున్నారు. గత సంవత్సరం రూ.14వేల కోట్ల రుణాలను అందించారు. తాజాగా ఇచ్చే రుణాల ద్వారా దాదాపు 40లక్షలకు పైగా మహిళలు లబ్ధిపొందనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 65లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వారి అవసరాల ఆధారంగా ఒక్కో సంఘానికి రూ.7.50లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు. ఈ రుణాల రికవరీ రేటు గ్రామీణ ప్రాంతాల్లో 98శాతం ఉన్నది. దీంతో బ్యాంకర్లు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలు మాత్రమే వడ్డీ లేని రుణాలకు అర్హులు. ఈ ఏడాది నుంచి రుణం మొత్తాన్ని పెంచే విధంగా సెర్ప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అర్హత ఉన్న సంఘాలకు రూ.10లక్షల వరకు రుణం అందించే విధంగా బ్యాంకర్లను ఒప్పించాలని నిర్ణయించారు.