ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఒక వ్యక్తి కరోనాతోపాటు అనంతరం తలెత్తిన బ్లాక్ ఫంగస్, అవయవాల వైఫల్యంపై పోరాడారు. సుమారు మూడు నెలల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. 54 ఏండ్ల భరత్ పంచల్కు కరోనా తొలి డోసు టీకా తీసుకున్న రెండు వారాలకు జ్వరం వచ్చింది. పరీక్షించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అనంతరం వారం రోజులకు ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. సిటీ స్కాన్లో వ్యాధి తీవ్రత 25కు 21గా ఉన్నది. హిరానందాని హాస్పిటల్లో అడ్మిట్ అయిన పంచల్కు వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందించారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతోపాటు ఇతర అవయవాల్లో సమస్యలు తలెత్తాయి.
కరోనా రోగులు ఎదుర్కొనే బ్లాక్ ఫంగస్తోపాటు మూత్రపిండాలు, కాలేయం, సెప్సిస్ వంటి మల్టీ ఆర్గాన్ వైఫల్యాలపై పంచల్ పోరాడారు. ప్లాస్మా థెరపీ నుంచి అందుబాటులో ఉన్న అన్ని వైద్య చికిత్సలను డాక్టర్లు అందించారు. చివరకు ఊపిరితిత్తుల నుంచి రక్తం కారడంతో అతడు బతకడం కష్టమని భావించి కుటుంబ సభ్యులు ఆశలు వదులుకున్నారు. అయితే 70 రోజుల పాటు వెంటిలేటర్పై ఉన్న పంచల్ అన్ని అనారోగ్య సమస్యలను జయించారు. 85 రోజుల తర్వాత సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరారు. గత 15 నెలల్లో ఎవరూ కూడా ఇంత సుదీర్ఘంగా ఆసుపత్రిలో చికిత్స పొందలేదని హిరానందాని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.