ముంబై : కొవిడ్-19 వ్యాక్సిన్ కొరతపై కేంద్ర ప్రభుత్వ తీరును ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంటే వ్యాక్సిన్ ఉత్పత్తి మందకొడిగా సాగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమకు తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి తీసుకువస్తే ముంబై నగరం అంతటికీ కేవలం 24 గంటల్లో వ్యాక్సినేషన్ చేపడతామని ఆమె స్పష్టం చేశారు.
ఒక్క రోజులో మూడు షిఫ్టుల్లో అధికారులు, సిబ్బంది శ్రమించి నగర పౌరులందరికీ వ్యాక్సిన్ అందిస్తామని అన్నారు. మహారాష్ట్రకు కేంద్రం కేటాయించిన వ్యాక్సిన్లలో సింహ భాగం ముంబై నగరానికి ఇస్తున్నా అవి ఏ మాత్రం సరిపోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత ఏడు రోజులుగా ముంబైలో 4000 లోపు కేసులు నమోదవుతుండటం కొంత ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 3039 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 71 మంది మహమ్మారి బారినపడి మరణించారు.