ముంబై: ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరో కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాటిల్ అనే వ్యక్తి ఐరోలి సెక్టార్-2 ప్రాంతంలో నివసిస్తున్నారు. తండ్రితో గొడవల కారణంగా పాటిల్ ఇద్దరు కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం పాటిల్ తన ఇద్దరు కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిపించారు. కారు బీమా విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరినీ కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజయ్ మృతిచెందాడు. అతని సోదరుడు సుజయ్కి మాత్రం ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.