న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో అరెస్టు అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే.. ముంబైలో ఓ వసూళ్ల ముఠాను నడిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచారణలో తేల్చింది. నారీమన్ పాయింట్ వద్ద ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ నుంచి ఆ దందా సాగించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 12 లక్షల కిరాయితో వంద రోజుల పాటు సచిన్ వాజే పేరిట ఆ రూమ్ను బుక్ చేసినట్లు విచారణలో తేల్చారు. అయితే ఓ వ్యాపారవేత్త పేరిట ఆ రూమ్ను బుక్ చేసినట్లు తెలిపారు. స్టార్ హోటల్లో ఉన్న రూమ్కు వచ్చేందుకు ఇన్స్పెక్టర్ వాజే ఫేక్ ఐడెంటిటీ వాడేవారని తేల్చారు. సస్పెండ్ అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.
స్టార్ హోటల్లోని రూమ్ నెంబర్ 1964 నుంచి సచిన్ వాజే ఆపరేట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నకిలీ ఆధార్ కార్డుతో అతను రూమ్లోకి ఎంటరైనట్లు తెలిపారు. సుశాంత్ సదాశివ్ ఖామ్కర్ పేరుతో అతను రూమ్కి వచ్చేవాడు. క్రైం బ్రాంచ్లో రిపోర్ట్ చేస్తూ ఫిబ్రవరి వరకు కూడా సచిన్ వాజే విధులకు హాజరైనట్లు గుర్తించారు. ఫిబ్రవరి 16వ తేదీన ఇన్నోవా వాహనంలో హోటల్కు వచ్చిన సచిన్ వాజే.. ఆ తర్వాత 20వ తేదీన ల్యాండ్ క్రూయిజర్లో బయటికి వెళ్లారు. ఆ రెండు వాహనాలను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేశారు. హోటల్ రూమ్లో ఉంటూ సమీపంలో ఉన్న రెస్టారెంట్లపై లైసెన్సు పేరుతో రాత్రి పూట విచారణకు హాజరయ్యేవాడు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ముంబై మాజీ పోలీసు కమీషనర్ పరం బీర్ సింగ్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే.