ముంబై: ముంబై అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న మోహన్ చౌహాన్కు సిటీ కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. అంతేగాక సత్వర విచారణ కోసం ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నట్లు ముంబై పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా, గురువారం రాత్రి (తెల్లవారితే శుక్రవారం) ఓ 34 ఏండ్ల మహిళపై మోహన్ చౌహాన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అపై ఆమెను తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగక ఆమె మర్మావయవాల్లో ఇనుప రాడ్ జొప్పించి పైశాచిక అనందం పొందాడు.
ముంబై శివార్లలోని సాకినాక ఏరియాలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ టెంపో వ్యాన్లో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో టెంపో వ్యాన్ నుంచి రోడ్డు పక్కన పడేసి పరారయ్యాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని బాధితురాలిని రాజవాడి ఆస్పత్రికి తరలించారు. ఆ రోడ్డుపై ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.