బెంగళూర్ : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బెడ్ల కొరత ఇంకా వేధిస్తూనే ఉంది. బెంగళూర్ లో ఒకే బెడ్ ను ఇద్దరు బుక్ చేసుకున్నారని చెబుతూ 82 ఏండ్ల మహిళను అడ్మిట్ చేసుకోకపోవడంతో ఆమె దవాఖాన వద్దే ప్రాణాలు కోల్పోయారు. బీబీఎంపీని సంప్రదించి బాధిత మహిళ కుమారుడు ఓ ఆస్పత్రిలో బెడ్ ను బుక్ చేశాడు. తీరా ఆమెను అక్కడికి తీసుకువెళ్లిన తర్వాత బెడ్ ఖాళీ లేదని సిబ్బంది చెప్పడంతో పాటు కనీసం ఆక్సిజన్ అందించలేదు.
తన తల్లిని కాపాడుకునేందుకు ఆమె కుమారుడు ఐసీయూ బెడ్స్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బెడ్ కోసం రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. ఈ క్రమంలో మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విక్టోరియా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకోగా ఆక్సిజన్, మందులు ఇవ్వకపోవడంతోనే ఆమె మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇదే ధోరణి చోటుచేసుకుంటోంది. పలువురు ఒకే బెడ్ ను బుక్ చేసుకోవడంతో ముందుగా వచ్చే కరోనా రోగులకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయా ఆస్పత్రులు వెల్లడిస్తున్నాయి.