మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ఆగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న సిటీ కంపోస్ట్ ఎరువు(సేంద్రియ ఎరువు) వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు ఆదేశించారు. సేంద్రియ ఎరువుల వినియోగం వల్ల నాణ్యమైన పంటల ఉత్పత్తితోపాటు ఆరోగ్యానికి రక్షణగా ఉంటుందని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులతో పాటు సిటీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల వినియోగంపై ప్రత్యేకంగా సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల కొనుగోలుపై లభించే సబ్సిడీల గురించి తెలియజేయాలని సూచించారు. సమావేశంలో ఆగ్రోస్ ఎండీ రాములు, రాంకీ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థ ఎండీ గౌతంరెడ్డి, భవాని ఆర్గానిక్స్ ఎండీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.