న్యూఢిల్లీ: నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)పై సమగ్ర సమీక్ష కోసం రక్షణ శాఖ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఓ అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ( MS Dhoni )తోపాటు ఆనంద్ మహీంద్రాకు చోటు కల్పించడం గమనార్హం. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఎన్సీసీలో చేయాల్సిన మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. జాతి నిర్మాణంలో ఎన్సీసీ క్యాడెట్లు మరింత ప్రభావవంతంగా పాల్గొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. గతంలో ఎన్సీసీలో ఉన్న వాళ్ల సేవలను కూడా ఇందులో భాగంగా ఎలా వినియోగించుకోవాలన్నదానిపై సూచనలు ఇవ్వనుంది.
ధోనీ, ఆనంద్ మహీంద్రాతోపాటు ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, వినయ్ సహస్రబుద్ధి, ఆర్థికశాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వీసీ నజ్మా అక్తర్, ఎస్ఎన్డీటీ వుమెన్స్ యూనివర్సిటీ మాజీ వీసీ వసుధా కామత్వంటి వాళ్లు ఈ కమిటీలో ఉన్నారు. దేశ యువతలో వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ ఎన్సీసీ.