కరీంనగర్, ఏప్రిల్24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇప్పుడు ఎక్కడ విన్నా కరోనా మాటే. ఏ పత్రిక తిరగేసినా, ఏ టీవీ చూసినా ఇదే ముచ్చట. మొదటి విడుతతో పోలిస్తే సెకండ్వేవ్ ప్రజలందరినీ వణికిస్తున్నదంటూ ‘సోషల్ మీడియా’ అంతకంటే దారుణంగా భయపెడుతున్నది. అందులో చాలా వరకు అవాస్తవాలే అయినా, అనవసర ప్రచారం ఘోరంగా కుంగదీస్తున్నది. ఇలాంటి సమయంలో రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. కట్టడికి బహుముఖ యుద్ధం చేస్తూనే, ప్రజలకు అభయం ఇస్తున్నది. టెస్టుల దగ్గరి నుంచి వ్యాక్సినేషన్, క్వారంటైన్ సెంటర్లు, కరోనా కిట్లతో భరోసా ఇస్తున్నది. పడకల సంఖ్యను పెంచడంతోపాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో ఊపిరిపోస్తున్నది. ఇప్పటికే కరీంనగర్లో ఉత్పత్తి ప్లాంట్ అందుబాటులోకి రాగా, తాజాగా సిరిసిల్ల జిల్లాలో ట్రయల్ రన్ విజయవంతమైంది. మరోవైపు నాలుగు జిల్లాల్లో కంట్రోల్రూంలు, కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి అత్యవసర సేవలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరిస్తూ, విపత్తు వేళ ప్రభుత్వం ఉన్నదనే ధైర్యం ఇస్తున్నది.
సెలవులు లేకుండా సేవలు..
సెలవులు లేకుండా సేవలందిస్తున్నాం. మా సెంటర్లో రోజుకు 450 నుంచి 500 మందికి టీకాలు వేస్తున్నాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు విధులు నిర్వహిస్తున్నాం. సెంటర్లో కొద్ది మందిమే ఉన్నప్పటికీ ఎంతో ఓపికగా సేవలు అందిస్తున్నాం. కరోనా విపత్కర సమయంలో మా శాఖ బాధ్యతగా తీసుకున్నది. ఇలాంటి సమయంలో అందరు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
డాక్టర్ రాధిక, సప్తగిరి కాలనీ వాక్సినేషన్ సెంటర్ ఇన్చార్జి
టీకా వేసుకున్న దంపతులు
టీకా వేసుకోవడాన్ని ఇపుడు బాధ్యతగా గుర్తిస్తున్నారు. ఎక్కడ వాక్సినేషన్ సెంటర్లు ఉంటే అక్కడికి వెళ్లి టీకాలు వేయించుకుంటున్నారు. ఒక్కో కుటుంబంలో భార్యా భర్తలు కలిసి వచ్చి టీకాలు వేసుకుంటున్నారు. కొత్తపల్లి మండలం బద్ధిపల్లికి చెందిన ఉప్పు సత్తయ్య, బొందవ్వనే ఇందుకు నిదర్శనం. బద్దిపల్లి గ్రామస్తులకు టీకాలు వేసేందుకు ఆసిఫ్నగర్లో సెంటర్ ఏర్పాటు చేసినా, అక్కడ చాలా మంది ఉంటున్నారని కరీంనగర్ వచ్చామని చెప్పారు బొందవ్వ. అయితే ఇక్కడ కూడా అట్లనే మంది బాగున్నారని చెప్పారు. రోజురోజుకూ టీకాకు ఆదరణ ఎలా పెరుగుతున్నదో బొందవ్వ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
గద్దలపల్లి పీహెచ్సీ..
మంథని రూరల్, ఏప్రిల్ 24: మంథని మండలం గద్దలపల్లి పీహెచ్సీలో ఇప్పటి వరకు 7,432 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 488 మందికి పాజిటివ్గా తేలింది. ఇందులో 418 మంది కోలుకోగా, మరో 70 మంది హోంఐసోలేషన్లో ఉన్నారు. ఇక 11,253 మందికి టీకాలు వేయాల్సి ఉండగా, ఇప్పటికే 7605 మందికి వేశారు. ఇండ్ల వద్ద చికిత్స పొందుతున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
రాఘవాపూర్, రాగినేడులో..
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 24: పెద్దపల్లి మండలం రాఘవాపూర్, రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది నిరంతరాయంగా సేవలందిస్తున్నారు. రాఘవాపూర్ పీహెచ్సీ పరిధిలో రోజుకు సగటున 150 మందికి పైనే టీకాలు, 100 మందికి పైగా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2,936 మందికి వ్యాక్సినేషన్, 1,823 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇక రాగినేడు పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు 4,644 మందికి టీకాలు వేయగా, 3,060 గమందికి పరీక్షలుచేశారు.
వేములవాడలో నిర్విఘ్నంగా సేవలు..
వేములవాడ, ఏప్రిల్ 24: వేములవాడ పీహెచ్సీ పరిధిలో వైద్య సిబ్బంది నిర్విఘ్నంగా సేవలందిస్తున్నారు. నాలుగు వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 12,506 మందికి పైనే టీకాలు వేశారు. రోజుకు 200 నుంచి 300 మందికి టీకాలు వేస్తున్నారు. అలాగే రోజుకు ప్రతిరోజు 200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్గా తేలిన బాధితులకు మందుల కిట్లను అందజేస్తూ వైద్య సేవలను అందజేస్తున్నారు. అత్యవసరంగా ఉన్న వారికి సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలిస్తున్నారు.
గంగాధర పీహెచ్సీ..
గంగాధర, ఏప్రిల్ 24:గంగాధర పీహెచ్సీలో సగటున రోజుకు 600 టీకాలు.. 200 టెస్టులు చేస్తున్నారు. ఈ నెల ఒకటి నుంచి పరిశీలిస్తే గడిచిన 23రోజుల్లో 3,320 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 337 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక 45 ఏళ్లు పైబడిన 3,797 మందికి వ్యాక్సిన్ వేశారు. పీహెచ్సీతోపాటు సబ్ సెంటర్ల పరిధిలో మూడు రోజులుగా వ్యాక్సిన్ వేస్తున్నారు.
తిమ్మాపూర్లో 500మందిపైనే..
తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 24 : తిమ్మాపూర్ పీహెచ్సీ పరిధిలో రోజూ 400 మందికి పైనే వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే రోజూ 100 నుంచి 150 మందికి పరీక్షలు చేస్తున్నారు. శనివారం వరకు 45 ఏళ్లుపైబడిన 5,400 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి ఇందు తెలిపారు. ఇక పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లు అందజేస్తూ, నిత్యం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.