న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలాం జలాశయంలో నీటి స్థాయి మినీమమ్ 854 ఫీట్లు ఎత్తు ఉండాలని, కానీ 800 ఫీట్ల ఎత్తులో ఉన్నప్పుడు తెలంగాణ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని ఆరోపించారు. ఆదేశాలు ఇచ్చినా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోందన్నారు.. దీని వల్ల రాయలసీమకు నీటి కష్టాలు వస్తాయన్నారు. అన్టైమ్లీ జనరేషన్ ఆపాలన్నారు. ఏపీ, చెన్నై ప్రజల సంక్షేమం కోసం విద్యుత్తును ఆపాలన్నారు. ఈ ప్రశ్నకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బదులిస్తూ.. జెన్కోను విద్యుత్తు ఆపాలని కోరామన్నారు. కానీ జెన్కో విద్యుత్తు ఉత్పత్తి చేస్తోందని మంత్రి తెలిపారు.
ఎంపీ అవినాశ్ మరో అదనపు ప్రశ్న వేశారు. పాలమూరు ఇరిగేషన్ స్కీమ్కు.. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదన్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ డ్యామ్తో తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీల నీటిని ప్రతి రోజు వాడుకుంటుందని ఆరోపించారు. పాలమూరు వల్ల ఏపీ, చెన్నైకి తాగునీటికి కష్టాలు ఏర్పడుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలన్నారు. జల మంత్రి షెకావత్ స్పందిస్తూ.. ఇంటర్ స్టేట్ ఒప్పందాల ప్రకారం .. కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాశామన్నారు. రెండు బోర్డులకు నోటిసు ఇచ్చామన్నారు. బోర్డులకు శక్తి పెరుగుతోందన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు కేంద్ర మంత్రి ఆరోపించారు. మరో వైపు రైతు చట్టాలపై విపక్షాలు సభలో నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.