మాల్దా: మధ్యప్రదేశ్ రాష్ట్రం మాల్దా జిల్లాలో మిరాకిల్ చోటుచేసుకుంది. ఓ 29 ఏండ్ల మహిళ 5.1 కిలోల బరువున్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మాల్దాకు చెందిన రక్షా కుశ్వాహ (29) అనే మహిళ శనివారం పురిటి నొప్పులతో అంజినీయ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమెకు ప్రసవం చేయగా 5.1 కిలోల ఆడ శిశువు జన్మించింది. దాంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయ్యింది.
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువులు 2.5 కేజీల నుంచి 3.7 కేజీల బరువు ఉంటారని, అంతకుమించిన బరువుతో శిశువులు జన్మించడం అత్యంత అరుదని వైద్యులు తెలిపారు. మరీ 5 కేజీలకు మించిన బరువుతో శిశువులు జన్మించడం మాత్రం అసాధారణమని చెప్పారు. రక్షా కుశ్వాహ జన్మనిచ్చిన పాప 5.1 కేజీల బరువు, 54 సెంటీమీటర్ల పొడవు ఉన్నదని ఆమెకు ప్రసవం చేసిన వైద్యుడు అజయ్ తోష్ వెల్లడించారు.
పాప ఆరోగ్యంగానే జన్మించినప్పటికీ.. ఆదివారం మధ్యాహ్నానికి మూత్ర విసర్జనలో సమస్య ఉన్నట్లు తేలిందని అజయ్ తోష్ చెప్పారు. అయితే సమస్య చిన్నదే అని, కొన్ని పరీక్షలు చేసి చికిత్స అందిస్తే సరిపోతుందని తెలిపారు. సాధారణంగా మధుమేహం, ఊబకాయం, హార్మోనల్ సమస్యలు ఉన్నవారికి శిశువులు అధిక బరువుతో జన్మించే అవకాశం ఉంటుందని, కానీ రక్షా కుశ్వాహకు ఆ సమస్యలు ఏవీ లేవని చెప్పారు.