న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా ( Partap Singh Bajwa ).. రెండు రోజుల క్రితం రాజ్యసభలో హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. విపక్షాల ఆందోళన సమయంలో.. పార్లమెంటరీ సిబ్బంది కూర్చునే టేబుళ్లు ఎక్కి.. రాజ్యసభ చైర్మన్ కుర్చీపై రూల్ బుక్ను విసిరేశారు. ఈ ఘటన పట్ల చైర్మన్ వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. భావోద్వేగానికి గురైన వెంకయ్య కంటతడి కూడా పెట్టారు. అయితే ఆ ఘటన పట్ల క్షమాపణలు చెప్పేది లేదని కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా ఓ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మేం ఎందుకు క్షమాపణలు చెప్పాలి.. 20 నెలల నుంచి రైతులు నిరసనలు చేపడుతున్నారని, వారి గొంతు జనం వినాలన్నది మా తపన అని, మరి అలాంటప్పుడు నేనెందుకు క్షమాపణలు చెప్పాలి, వాళ్లేమి చేస్తారో చేయనివ్వండి అంటూ బాజ్వా తెలిపారు. వంద శాతం నేను క్షమాపణలు చెప్పను, కావాలంటే మీరు నన్ను జైలులో వేయండి.. కాల్చండి, రైతుల గోస వినకుంటే, వందసార్లైనా ఇలాగే చేస్తానని బాజ్వా అన్నారు.