భోపాల్ : కరోనా మహమ్మారి కోరలు చాచిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజులే పని దినాలు ఉంటాయని మధ్యప్రదేశ్ సీఎంవో స్పష్టం చేసింది. ఈ నిబంధనలు నేటి నుంచి మూడు నెలల పాటు అమల్లో ఉంటాయని పేర్కొంది. ఇక పట్టణ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేయబడుతుందని తెలిపింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్డౌన్ అమల్లో ఉంటుంది. చింద్వారా జిల్లాలో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వారం రోజుల పాటు పూర్తి స్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి.
మధ్యప్రదేశ్లో బుధవారం ఒక్కరోజే కొత్తగా 4,043 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,18,014కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 26,059.