ఆన్లైన్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల నిర్వహణ మార్గదర్శకాల్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక మార్పులుచేసింది. తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే కొన్ని కోర్సులను నిర్వహించవచ్చని పేర్కొన్నది. ఇందుకు కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని వెల్లడించింది. సవరణ వివరాలను ఏఐసీటీఈ వెబ్సైట్లో పొందుపరిచింది.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): న్యాక్ స్కోర్ 3.26 కన్నా అధికం లేదా ఎన్బీఏ స్కోర్ 700 లేదా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో మూడేండ్లలో రెండేండ్లపాటు టాప్ 100లో నిలిచిన విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఆన్లైన్ కోర్సులు నిర్వహించవచ్చు. మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటాసైన్స్, లాజిస్టిక్స్ అండ్ ట్రావెల్, టూరిజం కోర్సులను ఏఐసీటీఈ అనుమతి లేకుండానే నిర్వహించుకోవచ్చు. సంబంధిత విద్యాసంస్థ విద్యార్థులు, అధ్యాపకులకు సంబంధించిన అఫిడవిట్ను ఏఐసీటీఈ పోర్టల్లో అప్లోడ్చేయాలి.
గతంలో ఎన్బీఏ స్కోర్ 1000కి గాను 650 పాయింట్లు పొందితే సరిపోతుండగా, తాజాగా దానిని 700కు పెంచారు.
రెగ్యులర్ ప్రోగ్రాంల సీట్లకు మూడింతలు ఆన్లైన్ కోర్సుల్లో ఇన్టేక్గా తీసుకొనే అవకాశముండగా, దీనిని యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికేడాది సీట్ల సంఖ్యను మార్చనున్నట్టు పేర్కొన్నారు.