బెంగళూర్ : అన్లాక్ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి సినిమా థియేటర్లను యాభై శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరిచేందుకు కర్నాటక ప్రభుత్వం అనుమతించింది. ప్రేక్షకుల నుంచి స్పందన కొరవడటం, కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో తొలిరోజు బెంగళూర్లో పలు థియేటర్ల గేట్లు తెరుచుకోలేదు. థియేటర్ యజమానులు సైతం స్క్రీన్లను సిద్ధం చేయలేదు.
నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తేనే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు యోచిస్తున్నారని, సీటింగ్ పరిమితులతో సినిమాలు విడుదలైతే లాభాలకు విఘాతం కలుగుతుందని నిర్మాతలు భయపడుతున్నారని థియేటర్ యజమానులు చెబుతున్నారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం థియేటర్ల ఓపెన్పై మార్గదర్శకాలు జారీ అవడంతో పలు థియేటర్లు ఇంకా రీఓపెన్కు సిద్ధం కాలేదని, చాలా థియేటర్లను ప్రస్తుతం శానిటైజ్ చేస్తున్నారని కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్, నటుడు ఉమేష్ బంకర్ పేర్కొన్నారు.
కొత్త సినిమాల ప్రదర్శనకు కొంత సమయం పడుతుందని చెప్పారు. కర్నాటకలో 630 సింగిల్ స్క్రీన్లు ఉండగా, 260 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి. 12 లక్షల మంది సినీ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొత్త కంటెంట్ లేకపోవడంతో థియేటర్లలో ప్రదర్శనలు నిలిచిపోయాయని గరుడ మాల్ జనరల్ మేనేజర్ నందీష్ ఎంఆర్ చెప్పారు. తక్కువ ఆక్యుపెన్సీతో సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని, ఈ పరిస్ధితిలో తాము ఏమీ చేయలేమని ఎగ్జిబిటర్లు అశక్తత వ్యక్తం చేశారు.