జూన్ 21, 2019న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితమివ్వగా, అదే రోజు మంత్రి కేటీఆర్ నర్మాల ఎగువమానేరు వద్ద జలపూజలు చేశారు. అక్కడే నిర్వహించిన సభా వేదిక సాక్షిగా కాళేశ్వర జలాలతో ఎగువమానేరు జలాశయాన్ని నింపుతామని ప్రకటించారు. ఇప్పుడా మాటను నిజం చేశారు. సీఎం కేసీఆర్ సంకల్పం, రామన్న చొరవతో కాళేశ్వర జలాలు మండుటెండల్లోనూ పరుగులు తీశాయి. కొండపోచమ్మ కెనాల్ నుంచి కూడవెళ్లి వాగు ద్వారా చెక్డ్యాంలను నింపుకుంటూ ఎగువమానేరుకు తరలివచ్చాయి. 31 అడుగుల సామర్థ్యమున్న జలాశయాన్ని నింపడంతో, మంగళవారం నుంచి దిగువకు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టు ఏడు దశాబ్దాల చరిత్రలో మొదటిసారి మండుటెండల్లో మత్తడి దుంకుతుండగా, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన రైతులు, ప్రాజెక్టును చూసి సంబురపడ్డారు. దిగువకు పరవళ్లు తొక్కుతున్న నీళ్లను కండ్లకద్దుకుని ‘జై కేసీఆర్.. జై కేటీఆర్’ అంటూ నినదించారు. ఇదొక అద్భుత ఘట్టమని చెబుతున్నారు. యువకులు మానేరులో ఈత కొడుతూ యువకులు సరదాగా గడిపారు. ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
పంటలకు ఢోకా లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్సారు కృషితో మా మానేరు ఎండకాలంలో నిండింది. నిండుడే కాదు మత్తడి దుంకుతంది. చూస్తే ఎంతో సంతోషమైతంది. గిట్లయితే రెండు పంటలు పండుతయి. వానకాలం వచ్చిందంటే ఆకాశం వైపు చూస్తూ వానెప్పుడు పడుతదని ఎదురు చూసేటోళ్లం. ఇప్పుడా రందీ లేదు. మానేరులో నిండా నీళ్లున్నయి. ఇక వానకాలం పంటలకు ఢోకా లేదు.
పుట్టిన సంది గిట్ల నీళ్లను సూడలె..
నేను పుట్టిన 65 ఏళ్ల సంది గిట్ల ఎండళ్ల మానేర్ల నీళ్లను సూడలె. 70 ఏళ్ల చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ సారు తిరగరాసిండు. ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి మానేరు.. గింత ఎండల్ల నీళ్లు వచ్చి మత్తడి దుంకుతుండడం సారు చేస్తున్న పనులకు నిదర్శనం. దిగువన మానేరు వాగులో చెక్ డ్యాంలు త్వరగా పూర్తి చేసి సజీవనదిగా చేస్తానని మంత్రి కేటీఆర్ చెప్పిండు. ఆ మాట ఇన్నంక చాలా సంతోషమేసింది. మెట్ట ప్రాంత రైతులం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటం.