బెంగళూరు, సెప్టెంబర్ 24: పాములు పగబడుతాయని అంటుంటారు. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, కర్ణాటకలో ఒక కోతి మాత్రం ఓ వ్యక్తిపై పగను పెంచుకుంది. పగ అంటే అలాంటి ఇలాంటి పగ కూడా కాదు. 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో ఆ కోతిని విడిచిపెట్టినప్పటికీ, ఓ లారీలో మళ్లీ అదే గ్రామానికి వచ్చిన ఆ వానరం సదరు వ్యక్తి కోసం గంటలపాటు తీవ్రంగా గాలించింది కూడా. మరి కోతి పగకు కారణమేంటి? వివరాల్లోకెళితే.. చిక్కమగలూర్ జిల్లాలోని కొట్టిఘెహరా అనే గ్రామంలో ఐదేండ్ల వయసున్న ఓ మగకోతి స్థానికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసేది. ఇండ్ల మీదనున్న పెంకులను పడేయడం, పండ్లు, ఆహారాన్ని ఎత్తుకెళ్లడం, బట్టలు, పర్సులను దొంగిలించడం చేసేది. ఇంతజరిగినప్పటికీ, గ్రామస్థులు సర్దుకుపోయేవారు. అయితే, ఇటీవల పాఠశాలలు తెరిచారు. పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నప్పుడు.. ఆ వానరం వారిపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కోతిని పట్టుకోవడానికి సెప్టెంబర్ 16న గ్రామానికి వచ్చిన అధికారులకు ఆ వానరాన్ని బంధించడం కష్టంగా మారింది. దీంతో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జగదీశ్.. కోతిని పట్టుకోవడానికి అధికారులకు సాయం చేశాడు. దీంతో ఎట్టకేలకు ఆ వానరాన్ని అధికారులు పట్టుకున్నారు. తనను పట్టించిన జగదీశ్పై కోపం పెంచుకున్న ఆ వానరం.. అప్పటికప్పుడు అధికారుల నుంచి తప్పించుకొని జగదీశ్ వెంట పడింది. భయపడిపోయిన అతను తన ఆటోలో దాక్కున్నాడు. అది గమనించిన కోతి.. ఆటో టాప్, సీట్లను చించి.. జగదీశ్పై దాడి చేసింది. చెవులను కొరికింది. శరీరాన్ని రక్కింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ వానరాన్ని పట్టుకొని ఊరికి 22 కిలోమీటర్ల దూరంలోని ఓ అడవిలో దాన్ని విడిచిపెట్టారు. దీంతో జగదీశ్తో పాటు గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.
తనను అధికారులకు పట్టించిన జగదీశ్పై పగచల్లారని ఆ కోతి.. ఓ లారీ మీద ఎక్కి బుధవారం మళ్లీ గ్రామానికి చేరుకున్నది. జగదీశ్ జాడ కోసం ఇంటింటికీ తిరిగింది. కోతి చెవిమీద ఉన్న గుర్తును గమనించిన గ్రామస్థులు ఆ వానరం.. మునుపటిదేనని గుర్తించారు. ఊళ్లోకి కోతి వచ్చిన విషయాన్ని జగదీశ్కు చేరవేశారు. దీంతో భయపడిపోయిన అతను.. కోతికి కనబడకుండా తలదాచుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు కోతిని బంధించి తీసుకెళ్లారు. అయితే, ఆ కోతి మళ్లీ వస్తుందని జగదీశ్ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నాడు.