న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సాయంత్రం వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశం కానున్నారు. ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా హాజరయ్యే ఈ భేటీలో ప్రభుత్వ పనులు, కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులతో ప్రధాని మోదీ ఇటీవల చింతన్ శిబిరం పేరుతో సమావేశమైన నేపధ్యంలో తాజా భేటీ జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
పాలన మెరుగుపరిచేందుకు మంత్రులతో ఈ తరహా శిబిరాలను మరిన్ని నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. మంత్రులంతా తమ సహచరులు అమలు చేసే మెరుగైన పనిపద్ధతులు, విధానాలను అనుసరించాలని ఈ భేటీలో ప్రధాని సూచించారు. తమ అనుభవాలను అందరితో పరస్పరం పంచుకోవాలని కోరారు. ఇక మంత్రిత్వ శాఖ కార్యదర్శుల భేటీలో ప్రధాని మోదీ ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేయనున్నారు.