లక్నో, ఆగస్టు 5: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనీయకుండా అడ్డుకొంటున్న ప్రతిపక్షాలు సెల్ఫ్ గోల్ చేసుకొంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ‘దేశం హాకీలో గోల్ మీద గోల్ కొట్టుకొంటూ విజయాలు సాధిస్తుంటే మరోవైవు కొంత మంది తమ స్వార్థ రాజకీయాల కోసం సమావేశాలను అడ్డుకొంటున్నారు. సెల్ఫ్ గోల్స్ చేసుకొంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో హాకీలో భారత్ పతకాన్ని సాధించడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారు ఏం చేసినా దేశ పురోగతిని అడ్డుకోలేరని మండిపడ్డారు. మోదీ గురువారం యూపీలోని గరీబ్ కల్యాణ్ యోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఆగస్టు 5కి రెండేండ్లు గడిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజని పేర్కొన్నారు. గతేడాది ఇదే రోజు రామాలయం భూమి పూజ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.