లక్నో: కరోనా మహమ్మారి వెలుగు చూసిన తర్వాత చైనాకు విదేశీ సంస్థల నుంచి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చైనాలోని పలు పారిశ్రామిక సంస్థలు అక్కడ నుంచి ఉత్పత్తిని విరమించుకుని విదేశాలకు వెళుతున్నాయి.
ఆ కంపెనీలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ఇండియా సుముఖత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్ మేజర్.. దక్షిణ కొరియా సంస్థ శ్యామ్సంగ్ తాజాగా డ్రాగన్కు గట్టి షాక్ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో డిస్ప్లే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణం పూర్తయిందని శ్యామ్సంగ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇంతకుముందు చైనాలో ఈ యూనిట్ నిర్మించాలని తలపెట్టామని, కానీ మారిన ప్రస్తుత పరిస్థితుల్లో నోయిడాకు మార్చినట్లు తెలిపింది.
శ్యామ్సంగ్ ప్రెసిడెంట్ అండ్ సీఈవో (నైరుతి ఆసియా) కెన్కాంగ్ సారధ్యంలోని సంస్థ ప్రతినిధి బ్రుందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఆదివారం సమావేశమైంది. ఇందుకు యూపీ పారిశ్రామిక అనుకూల వాతావరణం, ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ విధానాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆ బ్రందం పేర్కొంది.
మేకిన్ ఇండియా విధానానికి కట్టుబడి ఉత్తరప్రదేశ్ను మాన్యుఫాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని శ్యామ్సంగ్ ప్రతినిధులు తెలిపారు. దేశీయంగా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కావడంతో టీవీలు, మొబైల్ ఫోన్లు చౌకగా అందుబాటులోకి రానున్నాయి.
ఈ సందర్భంగా శ్యామ్సంగ్ టీంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. నోయిడా కేంద్రంగా శ్యామ్సంగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ విజయవంతానికి ఉత్తమ ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.