మహారాష్ట్ర హోం మంత్రిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ సీపీ పరమ్బీర్సింగ్
పరమ్బీర్ లేఖపై పార్లమెంట్లో దుమారం
మహారాష్ట్ర సర్కారు గద్దెదిగాలని బీజేపీ డిమాండ్
ఆరోపణలు అవాస్తవం..
మంత్రి రాజీనామా అక్కర్లేదు: పవార్
ముంబై, మార్చి 22: మహారాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ (సీపీ) పరమ్బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గద్దె దిగాలని పార్లమెంట్ లో బీజేపీ డిమాండ్ చేయగా, మంత్రిపై సీబీఐతో నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని పరమ్బీర్సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీపీ పదవి నుంచి తనను అక్రమంగా బదిలీ చేశారని, ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన సోమవారం పిటిషన్ దాఖలుచేశారు. దేశ్ముఖ్ నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజీని వెంటనే స్వాధీనం చేసుకునేలా సీబీఐని, కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్కు చెందిన సచిన్ వాజే, ఏసీపీ సంజయ్పాటిల్ వంటి పోలీస్ అధికారులతో దేశ్ముఖ్ గత ఫిబ్రవరి మధ్యలో తన నివాసంలో సమావేశమయ్యారని పరమ్బీర్ ఆరోపించారు.
తనకు నెలకు రూ.100 కోట్లు వసూలు చేసివ్వాలని వారికి మంత్రి టార్గెట్లు విధించారని ఆరోపించారు. పోలీసుల బదిలీలు, పోస్టింగ్ వ్యవహారాల్లోనూ దేశ్ముఖ్ అక్రమాలకు పాల్పడ్డారని, గతేడాది ఆగస్టులో ఇంటెలిజెన్స్ కమిషనర్ రష్మీ శుక్లా ఈ విషయాన్ని హోంశాఖ అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. దేశ్ముఖ్పై చర్యలు తీసుకోవడానికి బదులుగా.. రష్మీ శుక్లా నోరు నొక్కారని ఆరోపించారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో నిష్పాక్షిక దర్యాప్తు కోసం తనను బదిలీ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నదని, తన కార్యాలయం, అధికారులు అన్ని విధాలుగా సహకారం అందించినట్టు వివరించారు. మరోవైపు, పరమ్బీర్ సింగ్ సోమవారం మహారాష్ట్ర హోం గార్డ్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు.
అట్టుడికిన పార్లమెంట్
పరమ్బీర్ లేఖ అంశం పార్లమెంట్ను కుదిపేసింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాదీ ప్రభుత్వం రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. శివసేన ఎంపీ వినాయక్ రౌత్ దీనిని ఖండించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు బీజేపీ పన్నిన కుట్ర ఇది అని ధ్వజమెత్తారు.
ఆరోపణలు అవాస్తవం: శరద్పవార్
అనిల్ దేశ్ముఖ్పై పరమ్బీర్ చేసిన ఆరోపణలు అవాస్తమని, మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టంచేశారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద వాహనం కేసును తప్పుదోవ పట్టించేందుకే పరమ్బీర్ ఈ ఆరోపణలు చేశారన్నారు. ‘పరమ్బీర్ లేఖను పరిశీలిస్తే.. ఫిబ్రవరి మధ్యలో మంత్రి నుంచి పోలీసులకు ఆదేశాలు వచ్చాయని అన్నారు. ఫిబ్రవరి 5-15 వరకు మంత్రి కరోనాతో నాగ్పూర్లో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 15-27 మధ్య క్వారంటైన్లో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
కేసును ఛేదించాం
మన్సుక్ హీరేన్ మృతి కేసులో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేనే ప్రధాన నిందితుడు అని ముంబై ఏటీఎస్ డీఐజీ శివదీప్ లాండే వెల్లడించారు. ఈ కేసును తాము ఛేదించినట్టు ఆదివారం ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలిపారు. కేసును దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించిన మరుసటి రోజే ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘నా కెరీర్లో అత్యంత క్లిష్టమైన మన్సుక్ హీరేన్ మృతి కేసును ఛేదించాం’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పోలీస్ అధికారి వినాయక్ షిండే, క్రికెట్ బుకీ నరేశ్గౌర్ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హీరేన్ మృతదేహం లభ్యమైన చోటుకి షిండేను తీసుకెళ్లి పరిశీలించారు. హత్య కోసం వాజేకి, షిండేకి గౌరే సిమ్కార్డులు అందజేసినట్టు అధికారులు తెలిపారు. హీరేన్ కేసులో 11 మంది ప్రమే యం ఉన్నదని, మార్చి2న అతడి హత్యకు కుట్ర చేసినట్టు సమాచారం. పోలీసులు, జర్నలిస్టులు వేధిస్తున్నారని హీరేన్తో వారే సీఎంకి లేఖ రాయించారని, తద్వారా వేధింపులు భరించలేకే అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించాలని కుట్ర పన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.