సుమారు గంటపాటు సమావేశం.. పలు అంశాలపై చర్చ
న్యూఢిల్లీ, జూలై 17: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. జాతిప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించినట్టు పవార్ ట్వీట్ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖ, రైతుల సమస్యలపై పవార్ ఈ భేటీలో ఆందోళన వ్యక్తం చేశారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానుండటం, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తాయన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే, మహారాష్ట్ర సంకీర్ణ సర్కారుకు ఢోకాలేదని, బీజేపీతో ఎన్సీపీ ఎన్నటికీ జట్టు కట్టబోదని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల బరిలో పవార్ నిలుస్తారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను పవార్ తోసిపుచ్చారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల పవార్తో పలుమార్లు భేటీకావడంతో.. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే చర్యలు మొదలయ్యాయనే చర్చ కూడా మొదలయ్యింది.
కేంద్రం జోక్యం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే
సహకార మంత్రిత్వ శాఖ, బ్యాంకింగ్ సవరణల చట్టంపై మోదీతో జరిగిన భేటీలో పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానికి రాసిన లేఖను పవార్ బహిర్గతం చేశారు. సహకార బ్యాంకుల రంగం రాష్ర్టాలకు సంబంధించినదని, దీంట్లో కేంద్రం జోక్యం రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు.