న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మరణాలపై అమెరికన్ పత్రిక న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కథనంలో వెల్లడించిన గణాంకాలు వక్రీకరించిన అంచనాలతో కూడినవని నిరాధార, తప్పుడు రాతలనిపేర్కొంది. భారత్ లో 3.15 లక్షల కరోనా మరణాలు సంభవించాయని ప్రభుత్వం చెబుతుండగా వాస్తవంగా మహమ్మారి బారినపడి 16 లక్షల వరకూ మరణాలు ఉండవచ్చని న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్లో మే 25న పేర్కొంది.
దవాఖానలు రోగులతో నిండిపోవడం, ఇండ్లలోనే పలు కరోనా మరణాలు చోటుచేసుకోవడంతో మరణాలు అధిక సంఖ్యలో ఉండే అవకాశం ఉందని పత్రిక కథనం అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 మరణాలను కూడా అధికారిక మరణాల్లో కలపలేదని ఎమరీ యూనివర్సిటీలో అంటువ్యాధుల నిపుణులు కయక షియడ పేర్కొన్నట్టు రాసుకొచ్చింది. కాగా భారత్ లో కరోనా మరణాలపై న్యూయార్క్ టైమ్స్ కథనం నిరాధారమని, తప్పుడు అంచనాలతో కూడినదని అధికార వర్గాలు తోసిపుచ్చాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా వక్రీకరించిన అంచనాలతో ఈ నివేదికను వండివార్చారని స్పష్టం చేశాయి.