న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్వేర్ ‘పెగాసస్’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర మంత్రులు, చట్ట సభ్యులు, సీనియర్ ప్రతి పక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులతోపాటు ఇతర రంగాలకు చెందిన వారి సెల్ ఫోన్లను అక్రమంగా హ్యాక్ చేయడం రాజద్రోహమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ డేటాను విదేశీ కంపెనీ పొందడం జాతీయ భద్రత డొల్లతనానికి నిదర్శనమని విమర్శించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తొలగించాలని, ప్రధాని నరేంద్ర మోదీపై దర్యాప్తు జరుపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
మరోవైపు కుమార్తెలు, భార్యలు, కుటుంబ సభ్యుల మొబైల్ ఫోన్లలో కూడా పెగాసెస్ చొరబడవచ్చని కాంగ్రెస్ అధికారి ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా హెచ్చరించారు. అప్పుడు బాత్ రూమ్, బెడ్ రూమ్లో మాట్లాడుకున్నవి కూడా మోదీ ప్రభుత్వం రహస్యంగా వింటుందని విమర్శించారు.