న్యూఢిల్లీ, జూలై 20: ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ను లింక్ చేయడం/లింక్ అయిన ఫోన్ నంబర్ను మార్చుకోవడానికి ఇకపై ఆధార్ సెంటర్కు వెళ్లనక్కర్లేదు. ఊర్లోని పోస్టాఫీసులో, లేదా ఇంటివద్దే పోస్ట్మ్యాన్ సాయంతో అప్డేట్ చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, యూఐడీఏఐ కలిసి ఈ సేవను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దేశవ్యాప్తంగా 650 పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులు, 1.46 లక్షల మంది పోస్ట్మ్యాన్లు, గ్రామీణ డాక్ సేవక్ల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. పోస్ట్పేమెంట్ బ్యాంకుల్లో చిన్నపిల్లలకు ఆధార్ ఎన్రోల్మెంట్స్ సర్వీసును కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఏడాది మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా 128.99 కోట్ల ఆధార్ కార్డులను జారీచేశారు.