భోపాల్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గాజులు అమ్మే ( Bangle Seller ) ఓ ముస్లిం వ్యక్తిని కొందరు చితకబాదారు. ఈ ఘటన పట్టణంలోని బన్గంగా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్నది. గాజులు అమ్మే వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద నుంచి పదివేల లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. తన వ్యాపారాన్ని నడుపుకునేందుకు ఆ బాధిత వ్యక్తి నకిలీ పేరును వాడుతున్నట్లు మంత్రి తెలిపారు. తస్లీమ్ అనే వ్యక్తిని చితకబాదిన వీడియో ఆదివారం వైరల్ అయ్యింది. ఈ ఘటనలో పోలీసులు దాడి, దొంతగతనం కేసు నమోదు చేశారు. అయితే దాడికి గురైన ముస్లిం వ్యక్తి.. హిందూ పేరుతో వ్యాపారం సాగిస్తున్నాడని, అతని వద్ద రెండు రకాల ఆధార్ కార్డులు ఉన్నాయని మంత్రి నరోత్తమ్ తెలిపారు. ఈ ఘటన పట్ల సోషల్ మీడియాలో రియాక్ట్ కావొద్దు అని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. గాజుల వ్యాపారిపై దాడి చేసిన వారిని వీడియో ద్వారా గుర్తించామని ఇండోర్ ఎస్పీ అశుతోష్ బాగ్రి తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.