చెరువులు ఉప్పొంగాయి.. వందలాది కాలనీలు జలమయమయ్యాయి.. ఇండ్లు, వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల సెల్లార్లు రోజుల తరబడి నీట మునిగాయి. దీనికి కారణం గొలుసుకట్టు చెరువుల అనుసంధానం సరిగ్గా లేకపోవడం. ఉమ్మడి రాష్ట్రంలో పట్టింపులేని తనమే వరదల ఫలితం. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం తొలివిడుత రూ. 100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలంలో 37 గొలుసుకట్టు చెరువులున్నాయి. వీటిని అనుసంధానించడంతోపాటు వరద సాఫీగా పోయేలా కాల్వలను నిర్మించనున్నారు. ఈ చెరువుల సమీపంలో కాలనీల నుంచి వచ్చే మురుగునీరు చెరువుల్లో చేరకుండా రూ. 23 కోట్ల వ్యయంతో ట్రంక్లైన్ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. ఈ ట్రంక్లైన్ ద్వారా మురుగును సరూర్నగర్ చెరువుకు తరలించి అక్కడ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)లో శుద్ధి చేసి నీటిని వదులుతారు. ఈ నీటిని ఎల్బీనగర్ ప్రాంతం మీదుగా నాగోలు వద్ద మూసీలోకి వెళ్లేలా కాల్వ నిర్మాణం చేపట్టనున్నారు. చారిత్రక వారసంపదకు నెలవైన చెరువులను రక్షించడంతోపాటు సుందరీకరించి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనున్నారు.
ఏకమైన చెరువులు, కుంటలు… వీధులన్నీ జలమయం… కాలనీలు జలదిగ్బంధనం… రోజుల తరబడి నీటిలోనే జ(ల)న జీవనం.. చారిత్రక హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో గతేడాది నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు. క్షణమొక యుగంలా… ప్రతి రాత్రి ఓ పీడకలలా మారిన ఆ కష్టాలు పునరావృతం కావొద్దని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. సమైక్య రాష్ట్రంలో జరిగిన తప్పిదాలు ఎన్ని ఉన్నా… మళ్లీ ప్రజలకు ముంపు పీడ ఉండొద్దనే కృతనిశ్చయంతో బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. వరద జనావాసాలను ముంచెత్తకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు మొదలయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్ మండల పరిధిలో 37గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వీటిని పట్టించుకోకపోవడంతో ఫీడర్ ఛానెల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. వేలాది కాలనీలు వెలిసి… నగర శివారు ప్రాంతాలు హైదరాబాద్ కోర్ సిటీని తలదన్నే రీతిలో అభివృద్ధి చెందాయి. దీంతో భారీ వర్షాలు పడినప్పుడు చెరువులు నిండి… మత్తడి దుంకిన వరద ఎటు పోవాలో తెలియక ఆవాసాలను ముంచెత్తుతుంది. ఈ క్రమంలో 2020 అక్టోబరు 14వ తేదీన హైదరాబాద్ చరిత్రలో రెండో అతి పెద్ద కుండపోత వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాలాపూర్ పరిధిలో ఎగువన ఉన్న సుల్తాన్పూర్ బురాన్ఖాన్ చెరువు పొంగి పొర్లింది. ఆర్సీఐలోని పెద్ద చెరువును ముంచెత్తిన వరద ఆపై బార్కస్లోని ఎర్రకుంటను దాటి… బాలాపూర్ పెద్ద చెరువుకు చేరింది. ఆ చెరువు కూడా నిండటంతో వరద కాలనీలను ముంచెత్తింది. అదేవిధంగా మంత్రాల చెరువు, సంద చెరువు ఇలా అన్నీ ఏకమయ్యాయి. ఫలితంగా ఎల్బీనగర్ పరిధిలోని అనేక కాలనీలు కూడా నీటమునిగాయి. ఈ ప్రభావం పాతబస్తీపైనా పడి… పాత నగరంలోని వీధుల్లో జల విలయం చోటుచేసుకుంది. వందేళ్ల చరిత్రలో ఎవరూ ఊహించని ఇది రెండో అతి పెద్ద వర్షం కావడంతో నియంత్రణ కూడా ఎవరి చేతుల్లో లేకుండా పోయింది.
బాలాపూర్ పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకుండా చూడటంతోపాటు నగర శివారులో… అందునా కాంక్రీట్ జంగిల్ నడుమ లాంగ్ స్పేస్ ఉండేలా సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువు కట్టల్ని పటిష్టం చేసి పచ్చదనాన్ని పెంపొందించడం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, ఫౌంటేన్లతో వాటిని పర్యాటక ప్రాంతాలు తీర్చిదిద్దుతున్నారు.
గతేడాది జనం పడిన అవస్థలు మళ్లీ ఎప్పుడూ పడకుండా ఉండేందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కార దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు 200 కోట్లు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నిధుల కొరత రాకుండా శాశ్వత పరిష్కార పనులు పూర్తయ్యేలా చూడాలని తనతోపాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఇటీవల ఆర్థిక మంత్రి హరీశ్రావు కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎన్సీపీఈ అనే కన్సల్టెన్సీ ద్వారా సర్వే కూడా పూర్తయి… ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు.
ముంపు నివారణతోపాటు ఉమ్మడి పాలనలో బతికి బట్టకట్టిన నగర శివారు చెరువులను భావితరాలకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. బాలాపూర్ పరిధిలోని పెద్ద చెరువు, మంత్రాల చెరువు, చందన చెరువుల్లో ఇప్పటికీ భారీస్థాయి నీటి నిల్వ సామర్థ్యంతో జలకళ ఉట్టిపడుతుంది. ఈ నేపథ్యంలో వందలాది కాలనీలు వెలసిన దరిమిలా ఆ మురుగు చేరినట్లయితే భవిష్యత్తులో అవన్నీ మురికి కూపాలుగా తయారవుతాయి. అందుకే కాలనీల మురుగు వీటిలో చేరకుండా 23 కోట్లతో ప్రత్యేకంగా ట్రంక్లైన్ను నిర్మించారు. ఈ ట్రంక్లైన్ పెద్ద చెరువు, మంత్రాల చెరువు, చందన చెరువు చుట్టూ మురుగును సేకరించి… మంద మల్లమ్మ వద్ద ఉన్న జంక్షన్లో కలవనుంది. తద్వారా ప్రస్తుతం ఉన్న నాలా ద్వారా మురుగు నేరుగా సరూర్నగర్ చెరువు చేరుకుంటుంది. అక్కడ మురుగు శుద్ధికి ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ చరిత్రలో రెండో అతి పెద్ద వర్షం సృష్టించిన బీభత్సాన్ని చూశాం. జలదిగ్బంధనంతో జనం ఎంత బాధపడ్డారో… కాలనీల్లో తిరిగి స్వయంగా చూశాను. రాత్రి పగలు తేడాలేకుండా పని చేశాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన సహాయక చర్యలు ముంపు బాధితులకు కాస్త ఉపశమనాన్ని కలిగించాయి. కానీ ఇకముందు ప్రజలకు ఆ కష్టం రానీయకుండా ఉండేందుకు ముంపు పరిష్కార పనులకు సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే 200 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. సంవత్సరాల తరబడి ఉన్న సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం లభించనుంది. నిధుల విడుదలకు సానుకూలత వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్, అందుకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ధన్యవాదాలు. – సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖమంత్రి
గతేడాది ముంపునకు గురైన మరికొన్ని ప్రాంతాల్లోనూ వరదను సాఫీగా మూసీకి చేర్చేందుకు సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాదర్గుల్ కుర్మల్గూడ పరిధిలోని అంకమ్మ కుంట, సున్నం చెరువులు పొంగి పొర్లే సమయంలో వరదను కాల్వ ద్వారా తుర్కయాంజల్ పరిధిలో ఉన్న మాసాని చెరువుకు తరలిస్తారు. ఆపై అక్కడి నుంచి మరో వరద కాల్వ నిర్మాణం ద్వారా తట్టి అన్నారం వద్ద మూసీలోకి వదలనున్నారు. తద్వారా నాదర్గుల్, తుర్కయాంజల్, హయత్నగర్ ప్రాంతాల్లో ముంపు సమస్య తొలగనుంది.