ముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ నివాసానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మళ్లీ వచ్చింది. నాగ్పూర్లోని ఆయన ఇంట్లో తిరిగి సోదాలు ప్రారంభించింది. దీంతో కటోల్, నార్ఖెడ్ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా ఐసొలేషన్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన దేశ్ముఖ్ కూడా తిరిగి ఇంటికి చేరుకున్నారు. కాగా, సీబీఐ బృందం శనివారం ఉదయం అనిల్ దేశ్ముఖ్ నివాసంలో తనిఖీలు చేసింది. కరోనా నిబంధనల మేరకు సీబీఐ అధికారులు పీపీఈ కిట్లు ధరించి ఈ సోదాల్లో పాల్గొన్నారు.
ముఖేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలతో కారును నిలిపిన కేసుతో సంబంధమున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్ను నెలకు వంద కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ముఖ్ ఆదేశించినట్లు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్ ఆరోపించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాంబే హైకోర్టును ఆయన ఆశ్రయించగా ప్రాథమిక దర్యాప్తునకు కోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు శనివారం ఉదయం మహారాష్ట్రలో అనిల్, ఇతరులకు చెందిన నాలుగు చోట్ల రైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ్టి సోదాలు ముగిసినట్లు చెప్పారు. అయితే సీబీఐ అధికారులు మరోసారి రాత్రి వేళ అనిల్ దేశ్ముఖ్ నివాసానికి చేరుకున్నారు. తిరిగి సోదాలు జరుపుతున్నారు. కాగా, సీబీఐకి తాను అన్ని విధాలా సహకరిస్తున్నట్లు అనిల్ దేశ్ముఖ్ తెలిపారు.