చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2012 నుంచి 2021 మధ్య ఏఐఏడీఎంకే ప్రభుత్వం విపక్ష రాజకీయ నాయకులపై నమోదు చేసిన పరువు నష్టం కేసులను రద్దు చేశారు. సుమారు 130 పరువు నష్టం కేసుల ఉపసంహరణకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. డీఎండీకే చీఫ్ విజయకాంత్, ఆయన భార్య ప్రేమలత, కాంగ్రెస్ నాయకుడు ఈవీకేఎస్ ఎలాంగోవన్, డీఎంకే ఎంపీలు కనిమోళి, దయానిధి మారన్లకు ఊరట కలుగనున్నది.
సామాజిక కార్యకర్త, అవినీతి నిరోధక ఎన్జీవో కన్వీనర్ అరప్పర్ ఇయక్కం జయరం వెంకటేశన్పై నమోదైన కేసును కూడా డీఎంకే ప్రభుత్వం ఎత్తివేసింది. జర్నలిస్టులు, దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్స్పై నమోదైన 90 పరువు నష్టం కేసుల ఉపసంహరణకు ఆదేశించిన ఒక రోజు తర్వాత సీఎం స్టాలిన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే ఇచ్చిన హామీని ఈ మేరకు నెరవేర్చారు.