పాత కక్షల నేపథ్యంలో అల్లుడితో ఘర్షణ
మందలించిన బంధువులపై దాడి
పరస్పర దాడులతో.. ఐదుగురికితీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలు
తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేసిన పోలీసులు
నిజామాబాద్ జిల్లా ఫకీరాబాద్లో ఘటన
నవీపేట,మే 1: దూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణ పడడం పరస్పర దాడులకు దారి తీసింది. దాడిలో కత్తులు, కర్రలు ఉపయోగించడంతో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ముగ్గురు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ గురునాథ్ స్థానిక ఎస్సై యాకుబ్ తో కలిసి సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికులు, సీఐ గురునాథ్ కథనం ప్రకారం.. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి పోశెట్టి (పశువుల కాపరి) పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని తన దూడ పోయిందంటూ తాగి వచ్చి తన అల్లుడు లక్ష్మణ్తో ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న తన బంధువులనూ దుర్భాషలాడాడు. అక్కడే ఉన్న దూరపు బంధువు నారాయణ కలుగుజేసుకొని మందలించాడు. దీంతో పోశెట్టి, నారాయణ వర్గీయులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో గంగాధర్, నరేందర్, లింగన్న, నారాయణ, సుగన్నకు కత్తిపోట్లు కాగా, మరో ఇద్దరు పోశెట్టి, అనిల్కు స్వల్ప గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ గురునాథ్ తెలిపారు.