వ్యాక్సిన్ డోసుల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రెండు డోసులలోనే వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని వెల్లడించింది. కొవిషీల్డ్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత 12 వారాలకు రెండో డోస్ ఇస్తారని పేర్కొన్నది. అయితే, కొవాగ్జిన్ టీకా మొదటి డోస్ తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాలకు రెండో డోస్ ఇస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఇక, వ్యాక్సిన్ల మిక్సింగ్ సాధ్యామా..? అసాధ్యమా అనే దానిపై అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన జరుగుతున్నదని, దానివల్ల హానికర రియాక్షన్స్ వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఆరోగ్య శాఖ పేర్కొన్నది. అది ఒక పరిష్కారం లేని సైంటిఫిక్ ప్రశ్న అని, దానికి సైన్సే సమాధానం చెబుతుందని తెలిపింది. ప్రస్తుతానికి వ్యాక్సిన్ల మిక్సింగ్ ప్రక్రియ ఉండబోదని, రెండు డోసులకు ఒకే వ్యాక్సిన్ను ఇస్తారని స్పష్టంచేసింది.