యాదాద్రి భువనగిరి,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గొంతు తడిపే జలం.. ఎముకలను గుల్ల చేసి మనుషులను బతికున్న శవాలుగా మార్చింది. కిడ్నీ సమస్యల బారిన పడేసి జీవితాలను నరకప్రాయం చేసింది. మోతాదుకు మించిన ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలకు హానికరం అని తెలిసినా..ఆ విషాన్నే తాగాల్సిన పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో జీవచ్చవాలుగా బతుకులు వెళ్లదీసిన పుట్టపాక గ్రామస్థుల కన్నీటి చిత్రమిది.
వందకుపైగా కిడ్నీ బాధితులు. షుగర్, లోబీపీ వంటి రుగ్మతలతో బాధ పడుతున్న వారు ఇంటికొకరుగా ఉండడంతో గతంలో తరచుగా వైద్య శిబిరాలను నిర్వహించక తప్పని పరిస్థితి. డయాలసిస్తో ఆరుగురు మృత్యువాతపడడంతో.. ఏకంగా గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్నే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ స్థానికుల నుంచి వినిపించేది. ధర్నాలు, రాస్తారోకోలు సర్వసాధారణమవగా..సమస్యను పరిష్కరించాలంటూ హెచ్ఆర్సీ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఇంటింటికీ నల్లాతో సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీళ్లు ఫ్లోరైడ్ రక్కసిని తరిమేసింది. అలాగే కిడ్నీ సమస్యలకు సైతం పరిష్కారాన్ని చూపింది. ఫ్లోరైడ్పై మిషన్ భగీరథ సాధించిన విజయంతో ఏడాది కాలంలో పుట్టపాక గ్రామంలో కొత్తగా కిడ్నీ వ్యాధికి సంబంధించి కొత్త కేసులు నమోదు కాలేదు. వైద్య శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఫ్లోరైడ్ మూలంగా కళావిహీనమైపోయిన ఆ ఊరు..మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక..నేడు ఆయురారోగ్యాలతో కళకళలాడుతోంది. స్వాతంత్రం సిద్ధించిన ఇన్నేండ్లలో..సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి నాంది పలికిన గడ్డపైనే విజయ కేతనం ఎగరవేసిన పుట్టపాక గ్రామ ప్రస్థానమిది.
చేనేత పట్టు చీరలకు ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక గ్రామం ఒకప్పుడు రోగాలకు కేరాఫ్గా నిలిచింది. అద్భుత డిజైన్లతో పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్న చేనేత కళాకారులు ఉన్న ఈ గ్రామం జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందగా.. ఫ్లోరైడ్ విషయంలో నూ ఈ గ్రామం అదే స్థాయిలో ప్రచారంలోకి వచ్చింది. జిల్లాలో ఉన్న 66 ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో పాటు పుట్టపాక కూడా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంగా పేరొందింది. 4,600 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇంటికో బాధితుడు అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి.
పచ్చగా గారలు పట్టిన పండ్లతో ఫ్లోరైడ్ బాధితులు ఇక్కడ తారస పడుతుండగా..మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు పట్టిపీడిస్తున్న వారు రెండు, మూడేండ్ల క్రితం వరకు వంద మందికి పైగా ఉండేవారు. బాధితుల్లో చేనేత కార్మికులే అధికం కాగా.. డయాలసిస్ చేయించుకునేందుకు హైద్రాబాద్కు వెళ్లాల్సి రావడం బాధితులకు నరకయాతనగా ఉండేది. దీనికి తోడు షుగర్, లోబీపీ వంటి వ్యాధులతో బాధ పడుతున్నవారు సైతం కోకొల్లలుగా ఉండే వారు. ఈ నేపథ్యంలో తరచుగా వైద్య శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉండేది. డయాలసిస్తో బాధ పడుతూ ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాత పడ్డారు. అనారోగ్య సమస్యలకు ఫ్లోరైడ్ నీళ్లే కారణం కావడంతో శుద్ధ జలాలను అందించాలని ధర్నాలు, నిరసనలతో రోడ్డెక్కిన సందర్భాలు ఎన్నో. చివరకు ఓ న్యాయవాది ఇక్కడి సమస్యను హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లడంతో జఠిలమైన పుట్టపాక సమస్య దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గత ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమనాలు కలిగించాయి తప్పితే శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోలేదు.
జిల్లా వేదికగా మిషన్ భగీరథకు నాంది
దేశ వ్యాప్తంగా గుర్తింపును పొందిన మిషన్ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వేదికగా నాంది పలికారు. 2003 సంవత్సరంలో ఫ్లోరైడ్పై పోరు యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో పర్యటించారు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న మర్రిగూడ మండలంలో ఫ్లోరైడ్ బాధితులను చూసి చలించి పోయారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వెంటనే ఫ్లోరైడ్ సమస్యపైనే ప్రధానంగా దృష్టి పెట్టి ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2014లో చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్కు శంకుస్థాపన చేసి 2017లో ఆవిష్కరించారు. వెనువెంటనే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షిత మంచి నీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. రూ.970.34కోట్ల నిధులతో చేపట్టిన పనులతో జిల్లాలో ఉన్న 17 మండలాల్లోని 421 పంచాయతీల పరిధిలో ఉన్న 732 ఆవాసాలకు మిషన్ భగీరథ శుద్ధ జలాలు అందుతున్నాయి. ఫలితంగా..జిల్లాలో సాధారణానికి మించి అత్యధిక పరిమాణంలో ఫ్లోరైడ్ ఉన్న 66 ఆవాసాల్లో ఫ్లోరైడ్ పీడ విరగడైంది.
ఏడాదిలో కొత్త కేసు నమోదు కాలేదు..
కిడ్నీ సంబంధిత వ్యాధులకు సంబంధించి పుట్టపాక గ్రామంలో ఏడాది కాలంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా 1.80లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను నిర్మించారు. గ్రామంలోని 1,207 ఇళ్లకు గాను అన్నింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. అక్కడక్కడా కొద్దిపాటిగా పైపులైను పనులు మిగిలిపోవడంతో గ్రామంలో తొంభై శాతానికి పైగా ఆవాసాలకు మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికీ అందుతున్నాయి. గతంలో ఇక్కడి నీళ్లలో 2.0 పీపీఎం నుంచి 2.5 పీపీఎం వరకు ఫ్లోరైడ్ ఉండగా..మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ప్రస్తుతం 0.6 పీపీఎం మాత్రమే ఉంది. కొద్ది రోజుల క్రితం జిల్లా అధికారుల బృందం పుట్టపాకను సందర్శించి అక్కడి నీళ్లలో ప్రమాదకర స్థాయిలో ఫ్లోరైడ్ లేదని తేల్చింది. మిషన్ భగీరథ నీటి సరఫరా మొదలైన ఏడాది కాలంలో కొత్తగా కిడ్నీ సంబంధిత కేసులు ఒక్కటీ కూడా నమోదు కాలేదని బృందంలోని అధికారులు స్పష్టత ఇచ్చారు. ఫ్లోరైడ్తో పాటు కిడ్నీ సమస్య నుంచి సైతం ఉపశమనం లభించడంతో స్థానికుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.
ఏండ్ల నాటి బాధలు పోయినయ్: గంజి కోటేశ్వరి, గ్రామస్థురాలు
పంచాయతీ సరఫరా చేసే ఫ్లోరైడ్ నీళ్లను వారం రోజుల పాటు నిల్వ చేసుకుని తాగేటోళ్లం. అనారోగ్యం కలిగినా తాగేందుకు ఆ నీళ్లే మాకు దిక్కు. కొన్నాళ్ల వరకు ఫిల్టర్ నీళ్లను కొనుక్కుని తాగినం. మిషన్ భగీరథ నీళ్లు వచ్చినంక గ్రామంలో కిడ్నీ వ్యాధుల బాధలు పోయినయ్. రూపాయి ఖర్చు లేకుండా గుమ్మం ముందటకే నీళ్లొస్తున్నయ్.
తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు : సామల భాస్కర్, సర్పంచు, పుట్టపాక గ్రామం
తరతరాలుగా వస్తున్న సమస్యకు సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారు. గతంలో ఎన్నోమార్లు ధర్నాలు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మందులు, మాకుల కోసం ఖర్చు చేయలేక ఎన్నో పేద కుటుంబాలు తల్లిడిల్లినయ్. కిడ్నీ వ్యాధిన బారిన పడి ఆరుగురు చనిపోయారు కూడా. మిషన్ భగీరథ నీళ్లతో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
ఏడాదిలో ఒక్క కేసు లేదు: సాంబశివరావు, డీఎంహెచ్వో, యాదాద్రి భువనగిరి జిల్లా
గతంలో నిర్వహించిన శిబిరాల్లో నిర్వహించిన పరీక్షల్లో ఫ్లోరోసిస్, కిడ్నీలతో పాటు షుగర్, లోబీపీ కేసులే కనబడేవి. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వారిలో కూడా ఎక్కువగా ఈ తరహా రోగాలే ఉండేవి. మిషన్ భగీరథ నీళ్లు వచ్చాక ఈ ఏడాది కాలంలో కొత్తగా కిడ్నీ సంబంధిత వ్యాధికి సంబంధించి కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గతంలో కంటే చికిత్స, మందుల అవసరం కూడా ప్రస్తుతం తగ్గింది.
ప్రజలను చైతన్య పరుస్తున్నాం ః సాయిబాబా, డీపీవో, యాదాద్రి భువనగిరి జిల్లా
హెచ్ఆర్సీకి వెళ్లిన ఫిర్యాదు మేరకు కొద్దిరోజుల క్రితమే జిల్లా అధికారులతో కలిసి పుట్టపాకను సందర్శించడం జరిగింది. నీటి శాంపిల్స్ను సేకరించి పరీక్షలు నిర్వహించగా హాని కరమైనవేవి లేవని తేలింది. మిషన్ భగీరథ నీటి వాడకంపై స్థానికులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.