చండీగఢ్: మనిషి ఒకవైపు శాస్త్ర పరిజ్ఙానం పెంచుకుని అంతరిక్షంలో విహరిస్తుంటే కొందరు మాత్రం మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనుషులపట్ల అనాగరికంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పంజాబ్ రాష్ట్రం ముక్త్సార్ జిల్లా మాలౌత్ పట్టణ పరిధిలోని రవిదాస్ నగర్లో అలాంటి ఘటనే జరిగింది. బాలికతో మాట్లాడినందుకు స్థానికులు ఓ బాలుడిని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా అతడికి గుండు కూడా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రవిదాస్నగర్కు చెందిన 17 ఏండ్ల బాలుడు అదే కాలనీకి చెందిన 16 ఏండ్ల బాలిక స్నేహితులు. సోమవారం సదరు బాలిక ఆ బాలుడి ఇంటికి రావడాన్ని గమనించిన కొందరు స్థానికులు వారిని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా బాలుడికి గుండు కొట్టించారు. విషయం ముందుగా బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు బాలుడిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.