న్యూఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ విద్యావతిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో తెలంగాణలోని రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రత్యేక గుర్తింపు కల్పించినందుకు విద్యావతిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగువారై ఉండి ఈ గుర్తింపు రావడం కోసం కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని గోల్కొండ , వేయి స్తంభాల గుడి, బాసర , చార్మినార్కు కూడా ప్రత్యేక గుర్తింపు కల్పించవలసిందిగా యునెస్కో కు ప్రతిపాదన పంపాలని వారిని కోరారు. హైదరాబాదులోని గోల్కొండలో గల సౌండ్ అండ్ లైట్ షోను నవీకరణ చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్లేస్ నుండి పర్యాటకులకు అనువుగా ఉండే రాణి మహల్కు మార్చాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు.
యాదాద్రి, భద్రాచలం ,మహబూబ్ నగర్ లోని మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సందర్శించవలసిందిగా భారత పురావస్తు సర్వే (ASI) బృందాన్ని కోరారు . ఆ దేవాలయాల అభివృద్ధికి నిధులను విడుదల చేయవలసిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేసి అధునాతన టెక్నాలజీ ద్వారా నిర్మింపజేసిన యాదాద్రి దేవాలయాన్ని సందర్శించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, ఈడీ శంకర్ రెడ్డి పాల్గొన్నారు.