న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ నిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో బిల్లులు పాస్ చేస్తున్న తీరును ఆయన ఖండిస్తూ.. బిల్లులు పాస్ చేస్తున్నారా లేక పాపిడి చాట్ చేస్తున్నారా అని ఆయన తన ట్విట్టర్లో ప్రభుత్వ వైఖరిని ఖండించారు. బిల్లులను ప్రభుత్వం పాపిడి చాట్ తరహాలో పాస్ చేస్తోందని ఆయన విమర్శించారు. మొదటి పది రోజుల్లో మోదీ సర్కార్ 12 బిల్లులను పాస్ చేసినట్లు ఒబ్రెయిన్ ఆరోపించారు. అది కూడా ఏడు నిమిషాల్లోనే ఆ బిల్లులు పాసైనట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో డెరిక్ ఒబ్రెయిన్కు వ్యతిరేకంగా మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ మూవ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒబ్రెయిన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. ఇది మన దేశానికి, పార్లమెంట్కు అవమానం అని ఆయన అన్నారు. మరో వైపు విపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెల్లోకి దూసుకువెళ్లి నినాదాలు చేశారు. రూల్ 267 కింద ఇచ్చిన వాయిదా తీర్మానాలను రద్దు చేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య తెలిపారు. మెజారిటీ సభ్యులు సభా నిర్వహణ కోరుతున్నారని, విపక్ష ఎంపీల తీరును సరిగా లేదని అన్నారు. తీవ్ర గందరగోళం మధ్య సభను ఆయన 12 గంటల వరకు వాయిదా వేశారు.