న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ను ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ కలిశారు. ఢిల్లీలో వారు భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ ( Covaxin ) కోవిడ్ టీకాకు డబ్ల్యూహెచ్వో అనుమతి ఇచ్చే అంశంలో ఆ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్కు చెందిన మూడవ దశ ట్రయల్స్ ఫలితాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించింది. ఆ ఫలితాలను డబ్ల్యూహెచ్వో నిపుణుల కమిటీ సమీక్షిస్తున్నది. త్వరలోనే కోవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అప్రూవల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే హంగేరి నుంచి కోవాగ్జిన్కు జీఎంపీ సర్టిఫికేట్ వచ్చిన విషయం తెలిసిందే. కోవిడ్ నియంత్రణలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ మెచ్చుకున్నట్లు కేంద్ర మంత్రి మాండవీయా తన ట్విట్టర్లో తెలిపారు.
ఇటీవలే కేంద్ర మంత్రి మాండవీయను.. సీరం సంస్థ సీఈవో ఆధార్ పూనావాలా, బయోలాజికల్ ఈ సంస్థ ఎండీ మహిమ ధాట్ల కూడా కలిసిన విషయం తెలిసిందే.