జైపూర్: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. రాజస్థాన్లోని బార్మర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. పైలట్ శిక్షణలో ఉండగా సాంకేతిక లోపంతో మిగ్ -21 బైసన్ జెట్ విమానం సాయంత్రం 5.30 గంటలకు కూలినట్లు ఐఏఎఫ్ పేర్కొంది. పైలట్ విమానం నుంచి సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు ట్వీట్ చేసింది.
కాగా, మిగ్ -21 బైసన్ జెట్ యుద్ధ విమానాలు ఈ ఏడాదిలో మరో మూడు కూలిపోయాయి. మే 21న రాత్రి వేళ శిక్షణ కోసం విమానం నడుపుతుండగా పంజాబ్లోని మోగా జిల్లాలో ఒకటి కూలింది. ఈ ప్రమాదంలో స్క్వాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. మార్చిలో శిక్షణలో భాగంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అవుతుండగా మిగ్ -21 బైసన్ జెట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మరో పైలట్ చనిపోయారు. ఈ ఏడాది జనవరిలో రాజస్థాన్లోని సూరత్గఢ్ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయిన మరో మిగ్ -21 బైసన్ యుద్ధ విమానం శ్రీగంగానగర్ జిల్లాలో కూలిపోయింది. అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.