కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం గురువారం రాష్ట్రానికి చేరుకుంది. ఈ బృందం అసెంబ్లీ ఎన్నికల అనంతరం వివిధ ప్రాంతాల్లో జరిగిన హింసాకాండకు దారితీసిన పరిస్థితులను అథ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్ధాయి పరిస్థితిని మదింపు చేయనుంది. హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో ఈ ప్రతినిధి బృందం బెంగాల్ లో పర్యటించనుంది.
మరోవైపు ఎన్నికల అనంతర హింసపై తక్షణమే సమగ్ర నివేదికను పంపాలని హోంమంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సత్వరమే నివేదికను పంపని పక్షంలో ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కాగా బెంగాల్ లో దీదీ హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో మంగళవారం నాటికి ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఇక టీఎంసీ గూండాలు తమ కార్యకర్తలతో పాటు మహిళా కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.