మున్నేరుకు ఉట్టిపడుతున్న జలకళ
మండు వేసవిలోనూ పుష్కలంగా నీరు
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఖమ్మం, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ;తలాపునే మున్నేరు ఉన్నా.. తాగునీటి కోసం నగరవాసులు అల్లాడిపోయారు. ఎలాగైనా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ చెక్ డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఖమ్మం నగరవాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం లభించినట్లు అయింది. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ సమీపంలో రూ.7.75 కోట్లతో చెక్డ్యాం నిర్మించారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి.
ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టాలన్న మంత్రి ఆలోచనకు, రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందించడంతో నీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఖమ్మం నగరంలోని ప్రకాశ్నగర్ సమీపంలో చెక్డ్యాం నిర్మించారు. మున్నేరుకు మే నెలలోనూ జలకళ ఉట్టిపడడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, భూగర్భజలాలు పెరుగుతుండడంతో సమీప ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, బావులు, బోర్లలోనూ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. గతంలో వర్షకాలంలోనూ నగరవాసులు తాగునీటికి ఇబ్బందిపడ్డారు.
వృథానీటికి అడ్డుకట్ట..
వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం మీదుగా కృష్ణాజిల్లా వైపు వృథాగా పోతున్న మున్నేరు నీటిని ఒడిసిపట్టేందుకు చెక్డ్యాం నిర్మించారు. ప్రస్తుతం చెక్డ్యాంకు ‘జలసిరి’ సంతరించుకున్నది. మండువేసవిలోనూ చెక్డ్యాం నిండుకుండలా తొణికిసలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు నిల్వడం, అధికారులు అదే సమయంలో చెక్డ్యాం నిర్మించడంతో భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఏర్పడింది. ఏటా మున్నేరు ద్వారా మూడున్నర లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసేది. ఇది దాదాపు 30 టీఎంసీలకు సమానం.
వేగంగా చెక్డ్యాం పనులు..
ఏటా వేసవిలో తాగునీటి కోసం ఖమ్మం నగరవాసులు ఇబ్బందులు పడుతుండడంతో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. చెక్డ్యాం నిర్మాణంతో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చెక్డ్యాం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెక్డ్యాం నిర్మాణంతో ఖమ్మం రూరల్, ముదిగొండ వంటి ప్రాంతాల రైతులకు సాగునీరందే అవకాశం ఏర్పడింది. ఈ చెక్డ్యామ్ ద్వారా ఖమ్మం నగరంలోని అనేక ప్రాంతాలకు మంచినీటి సమస్య తీరనున్నది. ప్రస్తుతం ఖమ్మానికి పాలేరు రిజర్వాయర్ ద్వారా సాగర్ జలాలను తాగునీరుగా వినియోగిస్తున్నారు. చెక్డ్యాం నిర్మాణం పూర్తికావడంతో మున్నేరు నీటిని సైతం తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం లభించింది. చెక్డ్యామ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో పనులు పూర్తికానున్నాయి.