కరోనానుంచి త్వరగా కోలుకునేందుకు విటమిన్ మాత్రలు, యాంటీబయోటిక్స్, ఆయుర్వేద కషాయం అధికంగా తీసుకుంటున్నారా? అయితే, జాగ్రత్త. మీకు ఫిషర్స్ వచ్చే ఆస్కారం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి మే 20 మధ్యలో ఫిషర్స్ (మలద్వారం వద్ద పగుళ్లు) సమస్యతో తన వద్దకు 481 మంది రోగులు వచ్చినట్లు ప్రొక్టోలజిస్ట్ డా॥ అశిన్ పోర్వాల్ వెల్లడించారు. వారిలో ఎక్కువమంది కరోనానుంచి పూర్తిగా కోలుకున్న వారే. వాళ్లే ఎందుకు దవాఖాన పాలయ్యారు? దీని వెనుక ఓ విశ్లేషణ ఉంది. కరోనానుంచి కోలుకునేందుకు విపరీతంగా విటమిన్ ట్యాబ్లెట్లు యాంటీబయోటిక్స్ వాడటమే ఇందుకు కారణం. అలాగే దగ్గు, జలుబునుంచి ఉపశమనం పొందేందుకు అల్లం, తేనె, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, పుదీనాతో చేసిన ఆయుర్వేద కషాయం (కడా) అధికంగా తీసుకున్నవారు కూడా ఈ సమస్యతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. కషాయం అధికంగా తాగడం వల్ల హైపర్ ఎసిడిటీ, కడుపులో మంట, పేగులు ఎండకట్టుకుపోవడం, కడుపు నొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు గుర్తించారు. అలాగే మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ సమస్యతో మలద్వారం వద్ద పగుళ్లు (ఆనల్ ఫిషర్స్) ఏర్పడి రక్తస్రావం అవుతున్నట్లు నిర్ధారించారు. ఈ సమస్యను ప్రధానంగా కరోనానుంచి కోలుకున్న వారిలో గుర్తించారు. విటమిన్ డి అధికంగా వాడితే మలబద్ధకం వస్తుందని, విటమిన్ సి, జింక్ విరేచనాలకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, మితంగానే యాంటీబయోటిక్స్, విటమిన్ ట్యాబ్లెట్లు, కషాయాలు వంటివి తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.