పెద్దమందడి, జూలై 11: పుట్టగానే తల్లిని కోల్పోయి.. తండ్రి నిరాదరణకు గురై మేనత్త శివమ్మ వద్ద పెరుగుతున్న రెండు నెలల పసికందు లోకేశ్వరిని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పరామర్శించారు. శనివారం రాత్రి వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో మంత్రి పల్లెనిద్ర చేశారు. ఆదివారం ఉదయం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో శివమ్మతో మాట్లాడుతూ.. చిన్నారి పరిస్థితిపై ఆరాతీశారు. చిన్నారికి అవసరమైతే మెరుగైన వైద్యం అందించాలని వనపర్తిలోని ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులకు సూచించారు. అందుకయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.10 వేలను అందజేశారు. కొద్దిసేపు పాపను ఎత్తుకొని ఆడించారు.