ఇంట్లోనే కూర్చొని ఓ యూట్యూబ్ చానెల్ పెట్టుకొని ఎంతోకొంత సంపాదించే వాళ్లు ఈ మధ్య చాలా ఎక్కువయ్యారు. తాము క్రియేట్ చేసిన కంటెంట్ను నెటిజన్లు చూడటం ద్వారా యూట్యూబర్లు సంపాదిస్తారు. అయితే ఇప్పుడా సంపాదనకు కోత పడనుంది. యూట్యూబ్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో మంది ఇండియన్ యూట్యూబర్లను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇక నుంచీ యూట్యూబ్ ట్యాక్స్ విధించనున్నట్లు ఆ సంస్థ చెప్పడమే దీనికి కారణం.
అసలేంటీ యూట్యూబ్ ట్యాక్స్?
ఇదేంటంటే మీ యూట్యూబ్ చానెల్కు అమెరికా వ్యూవర్ల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను విధించడం. ఆ ట్యాక్స్ రేటును 15 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ నుంచే ఈ కొత్త ట్యాక్స్ను అమలు చేయనున్నారు. అంటే ఒకవేళ మీ చానెల్ను అమెరికాలో ఉన్న వాళ్లు ఫాలో అవుతుంటే, మీరు క్రియేట్ చేసిన కంటెంట్ను వాళ్లు చూస్తుంటే మీకు ఆదాయం వస్తుంది కదా. ఇప్పుడా ఆదాయంపై 15 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ పన్ను కేవలం అమెరికా బయటి యూట్యూబర్లకు మాత్రమే. ఈ ట్యాక్స్ అనేది ఏ యూట్యూబర్కు సానుకూల వార్త కాదని శ్లోక్ శ్రీవాస్తవ అనే ఓ యూట్యూబర్ అన్నాడు. అతని చానెల్కు అమెరికాలో 3 నుంచి 4 శాతం మంది వ్యూవర్లు ఉన్నారు. తనపై ప్రభావం తక్కువే అయినా.. అమెరికా వ్యూవర్లు ఎక్కువగా ఉన్న వారి ఆదాయంపై ప్రభావం పడుతుందని శ్రీవాస్తవ చెప్పాడు. అయితే మెజార్టీ ఇండియన్ యూట్యూబర్లు పెద్దగా అమెరికన్ ఆడియెన్స్కు సంబంధించిన కంటెంట్ క్రియేట్ చేయరని, అందువల్ల ఈ ట్యాక్స్ ప్రభావం అంతగా ఉండదని ఎంఏడీ ఇన్ఫ్లుయెన్స్ సీఈవో గౌతమ్ మాధవన్ అన్నారు.
పెద్ద చానెల్స్కు దెబ్బే
అయితే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్లకు మాత్రం ఇది దెబ్బే అని చెప్పాలి. ఇండియాలో టీ-సిరీస్కే చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 17.6 కోట్లతో ఆ చానెల్ టాప్లో ఉంది. ఇలాంటి చానెల్స్కు అమెరికా వ్యూవర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. వీళ్లకు 15 శాతం ట్యాక్స్ అంటే ఎక్కువే అన్నది మార్కెట్ నిపుణుల అంచనా.