శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వెళ్లారు. శ్రీనగర్లోని ఈడీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆమె హాజరైనట్లు అధికారులు ధృవీకరించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ముఫ్తీని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలిపారు.
మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఈ నెల 15న హాజరుకావాలంటూ ఈడీ ఇటీవల ముఫ్తీకి సమన్లు జారీ చేసింది. దీనిపై ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జారీ చేసిన సమన్లను సవాల్ చేశారు. ఏ కారణంతో సమన్లు జారీ చేశారు, దానికి చట్టబద్ధత ఉన్నదా లేదా అన్నది నిర్ధారణ అయ్యేంత వరకు వాటిని నిలిపివేయాలని కోర్టును కోరారు.
మరోవైపు ఈ నెల 21 వరకు ముఫ్తీ వ్యక్తిగత హాజరును కోరబోమని ఈడీ తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఢిల్లీ హై కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి బదులు శ్రీనగర్లోని ఈడీ కార్యాలయంలో గురువారం హాజరైనట్లు సమాచారం.