భయపెడుతున్న వైరస్… పట్టించుకోని ప్రజలు
ఆందోళన కలిగిస్తున్న వైరస్ సెకండ్ వేవ్
స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు
భౌతిక దూరం, మాస్కు వాడకాన్ని మర్చిపోయిన జనం
మాస్కుల్లేకుండానే జన బాహుళ్య ప్రదేశాల్లో విచ్చలవిడిగా సంచారం
వ్యాపార, వాణిజ్య కేంద్రాల్లోనూ కానరాని కొవిడ్ -19 నిబంధనలు
నిజామాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్క కేసు నమోదయితేనే భయంతో గజగజా వణికిపోయారు. అన్ని జాగ్రత్తలు పాటించారు. ప్రభుత్వాలు సైతం కరోనా కట్టడికి లాక్డౌన్ అమలుచేశాయి. కరోనా కేసులు తొలుత పెరిగినా.. ఆ తర్వాత తగ్గుముఖం పట్టడం, అదే సమయంలో లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం పూర్తిస్థాయిలో పోలేదని జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యాధికారులు పదేపదే సూచిస్తున్నా.. ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడం, ఆ ప్రభావం ఉభయ జిల్లాలపై పడడంతో మరోమారు ఆందోళన వ్యక్తమవుతున్నది. కేసులు పెరుగుతుంటే జన సంచార ప్రదేశాల్లో అత్యధికులు జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కరోనా వ్యాప్తికి ప్రధానంగా కారణమవుతున్నది.
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ గడగడలాడిస్తున్నది. కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలను అమలు చేస్తున్నా యి. ఎలా రక్షణ పొందాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. వైరస్ కాస్త తగ్గుముఖం పట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఏడాది కిందట కరోనా వైరస్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను తాకింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగు చూసిన తొలి కేసు, కరోనా మరణంతో అంతా అల్లాడిపోయారు. మార్చి 31న కామారెడ్డిలోనూ వెలుగు చూసిన మరో కేసుతో జనం ఆందోళనకు గురయ్యారు. ఎక్కడో జిల్లా కేంద్రంలో కరో నా కేసు వస్తే వందల కిలో మీటర్ల దూరంలోని ప్రజలు కూడా బెదిరిపోయారు. జాగ్రత్తగా ఉండాలంటూ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించారు. ప్రభుత్వాలు సైతం కరోనా నియంత్రణకు లాక్డౌన్ అమలు చేయడం, ఆ తర్వాత లాక్డౌన్ సడలించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కరోనా కేసుల పరంపర పెరుగుతూ… నవంబర్, డిసెంబర్ నెలాఖరు వరకు తగ్గుతూ కనిపించింది. జనవరి, ఫిబ్రవరిలో కేసులు అత్యల్పంగా వెలుగు చూడడంతో మహమ్మారి పని అయిపోయిందని అంతా భావించారు. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో పాజిటివ్ కేసులు విజృంభిస్తుండడం, ఆ ప్రభావం ఉభయ జిల్లాలపై పడడంతో మరోమారు ఆందోళన వ్యక్తం అవుతున్నది. కేసులు పెరుగుతుంటే ప్రజలంతా జన సంచార ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించకుండా తిరుగుతున్నారు. కొంత మంది అశ్రద్ధ, నిర్లక్ష్యం కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది.
జాగ్రత్తలు లేకుండా సంచారం…
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొన్నటి వరకు తగ్గుముఖం పట్టాయి. తిరిగి మార్చి మొదటి వా రం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్న వారు, వారితో సాన్నిహిత్యంగా ఉన్న వారు మాత్రమే భయానికి గురవుతున్నారు. జన సంచార ప్రదేశాల్లో మిగిలిన వారిలో కనీస జాగ్రత్తలు తీసుకోవాలనే శ్రద్ధ కనిపించడం లేదు. కొవిడ్ -19 నిబంధనలను పాటించడంపై ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం, వ్యక్తిగత శుభ్రతను పాటించాల్సిందేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తిరిగి వైరస్ వ్యాప్తి ప్రభావం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ శుభకార్యాలు, సమావేశాల్లో కొవిడ్ -19 నిబంధనలు గాలికి వదిలేసి పాల్గొంటున్న సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు ఏ మాత్రం ఉన్నా… నిర్ధారణ పరీక్షలు చేయించుకుని వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నిర్ధారణ పరీక్షలను పెంచారు. ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ జోరుగా టెస్టులు చేస్తున్నారు.
వైద్యులు ఏం చెబుతున్నారు..
ప్రస్తుతం జిల్లాలో వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఉన్నప్పటికీ స్వీయ నియంత్రణ పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 45 నుంచి 59 ఏండ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమానికి స్పందన వస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించాల్సిందే. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణకు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంలో అశ్రద్ధ వహించవద్దు. వైరస్ లక్షణాలు ఉన్న వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. తీవ్రతను బట్టి వైద్యుల సలహా మేరకు చికిత్స చేసుకోవాలి. కరోనా వైరస్ పూర్తిగా తగ్గిపోయిందని నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైతేనే బయటికి వెళ్లాలి. ఒకవేళ వెళితే తప్పనిసరిగా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలి. అలాగే అనవసర ప్రయాణాలు మానుకోవాలి. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడాలని నిపుణులు కోరుతున్నారు.