న్యూఢిల్లీ : భారత్ లో స్ధానికంగా వ్యాక్సిన్ తయారీ చేపట్టేలా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ వంటి విదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చి గురువారం పేర్కొన్నారు. భారత్ లో సత్వరమే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల సరఫరాలు చేపట్టేలా తాము సహకరించామని చెప్పారు.
మహమ్మారి విసిరిన సవాల్ ను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యాక్సిన్ సేకరణ కసరత్తులో భారత్ భాగస్వామ్యం అవుతోందని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వీ ష్రింగ్లా పేర్కొన్నారు. జీ7, జీ20, క్వాడ్, బ్రిక్స్, ఐక్యరాజ్యసమితి, డబ్ల్యూహెచ్ఓలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఇక వ్యాక్సిన్ కొరత నేపథ్యంలో విదేశీ వ్యాక్సిన్ కంపెనీలకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు హోంమంత్రిత్వ శాఖ సంసిద్ధత వ్యక్తం చేసింది.