లక్నో: అవకాశం దొరికితే కేంద్ర ప్రభుత్వంపై మండిపడే బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా సానుకూలంగా వ్యాఖ్యానించారు. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) జనాభా గణన కోసం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే పార్లమెంట్ లోపల, బయట కేంద్ర ప్రభుత్వానికి తమ పార్టీపరంగా మద్దతిస్తామని తెలిపారు. ‘దేశంలో ఓబీసీల జనాభా గణనను బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఏదైనా సానుకూల అడుగు వేస్తే, పార్లమెంటు లోపల మరియు వెలుపల బీఎస్పీ మద్దతు ఇస్తుంది’ అని మాయావతి శుక్రవారం హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, కులాల వారీగా జన గణనపై చర్చించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరారు. అయితే ఎస్సీ, ఎస్టీల జనాభా గణనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మాయావతి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఓబీసీ జనాభా గణనను జరుపాలని ఆమె డిమాండ్ చేశారు.