లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చిన్న పార్టీలతో జట్టు కడుతుందని ఆ పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఎస్పీ వైఖరితో పాటు ఆ పార్టీ దళిత వ్యతిరేక తీరుతో పెద్ద పార్టీలు దూరమవడంతో అఖిలేష్ దిక్కుతోచని స్థితిలో చిన్న పార్టీలను ఆశ్రయిస్తున్నారని దుయ్యబట్టారు. నిస్సహాయ స్థితిలోనే ఎస్పీ చిరు పార్టీలతో జట్టు కడుతోందని వరుస ట్వీట్లలో మాయావతి విరుచుకుపడ్డారు.
ఎస్పీ స్వార్ధపూరిత, సంకుచిత, దళిత వ్యతిరేక వైఖరితో యూపీలో పెద్ద పార్టీలు ఆ పార్టీతో కూటమికి వెనుకాడుతుండటంతోనే చిన్నా చితకా పార్టీలతో కూటమి కట్టేందుకు ఎస్పీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించి అధికారంలోకి వస్తామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. కాషాయ పార్టీతో విసిగి వేసారిన ప్రజలు మార్పు కోరుతున్నారని అన్నారు.